జైపూర్, జూన్ 13: రాజస్థాన్ కాంగ్రెస్లో మళ్లీ ముసలం పుట్టింది. గెహ్లాట్ సర్కార్పై మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు తనతో చెప్పినట్టు సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ సోలంకి తెలిపారు. అయితే ఆ ఎమ్మెల్యేల పేర్లను ఆయన వెల్లడించలేదు. అలాగే ఎవరి ఆదేశాల మేరకు ఎవరు ఈ ట్యాపింగ్కు పాల్పడుతున్నారో కూడా పేర్కొనలేదు. ‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో నాకు తెలీదు. ట్యాపింగ్లో రాష్ట్రప్రభుత్వం ప్రమేయం ఉందో లేదో తెలీదు. కానీ పలువురు ఎమ్మెల్యేలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు నాతో చెప్పార’ని ఆయన వెల్లడించారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఆ ఎమ్మెల్యేలు ఒక యాప్ను వాడుతున్నట్టు చెప్పారు. ట్యాపింగ్ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు తమపై నిఘా ఉంచినట్టు ఆ ఎమ్మెల్యేలు తనకు చెప్పారన్నారు. ఆ ఎమ్మెల్యేలు సచిన్ వర్గానికి చెందినవారా అని మీడియా ప్రశ్నించగా.. వారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ సోలంకి బదులిచ్చారు. ట్యాపింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ విప్ మహేశ్ జోషి మాట్లాడుతూ.. ఇవి నిరాధార ఆరోపణలని కొట్టివేశారు. జైపూర్ శానిటేషన్ విషయంలో తమ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ, ఆరెస్సెస్ పన్నిన కుట్ర ఇది అని మంత్రి ప్రతాప్సింగ్ ఆరోపించారు.
సచిన్ శిబిరం నుంచి తమవైపు రావాలని ముఖ్యమంత్రి గెహ్లాట్ తమపై ఒత్తిడి తెస్తున్నట్టు సచిన్ వర్గ ఎమ్మెల్యేలు ఆరోపించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా గెహ్లాట్పై సచిన్ తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ అధినాయకత్వం ఆయన బుజ్జగించింది. డిమాండ్ల పరిష్కారానికి ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అయితే కమిటీ ఇంకా ఎలాంటి పరిష్కారం చూపలేదు. దీనిపై సచిన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధినాయకత్వంతో భేటీకానున్నారు. కాగా, సంక్షోభానికి తెరదించేందుకు స్వయంగా సోనియాగాంధీ రంగంలోకి దిగినట్టు సమాచారం. త్వరలోనే రాజస్థాన్లో మంత్రివర్గ విస్తరణ జరుగనున్నది. ప్రస్తుతం తొమ్మిది బెర్తులు ఖాళీగా ఉన్నాయి. తమకు 6-7 మంత్రిపదవులు కేటాయించాలని సచిన్ వర్గం కోరుతున్నది. మంత్రివర్గంలో తమ వర్గానికి పెద్దపీట వేయాలన్నది గతంలో సచిన్ చేసిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. అయితే 18 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే, సీనియర్ సభ్యులను కూడా మంత్రివర్గ విస్తరణ విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.