జైపూర్: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిపై ప్రతాపం చూపుతున్న బ్లాక్ ఫంగస్ను (మ్యూకోర్మైకోసిస్ను) రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉండటంతో వీరికి చికిత్స అందించేందుకు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డును కేటాయించారు.
‘మ్యూకోర్మైకోసిస్ను అంటువ్యాధిగా గుర్తించాం. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చాం. అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అరోరా పేర్కొన్నారు. మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.