జైపూర్: దేశంలో కరోనా మహమ్మారి కారణంగా పిల్లల చదువులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. స్కూళ్లు, కాలేజీలను నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యాసంస్థల కాసుల వసూళ్లు ఎప్పటిలాగే కొనసాగుతున్నా.. విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు కాదుగదా కనీసం పరీక్షలు కూడా నిర్వహించే పరిస్థితి లేదు. దాంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు 10వ తరగతి, 12 తరగతి పరీక్షలను రద్దు చేశాయి.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తమతమ రాష్ట్రాల్లో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర బోర్డుల పరిధిలో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రం సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దాంతో వరుసగా ఒక్కో రాష్ట్రం పరీక్షల రద్దు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.