నిజాంసాగర్, ఏప్రిల్15: మండలంలో రూ.476.25 కోట్లతో నిర్మించనున్న నాగమడుగు ఎత్తిపోతల నిర్మాణ పనుల ప్రారంభోత్సవంతో పాటు కాళేశ్వరం నీటిని హల్దీవాగు ద్వారా నిజాంసాగర్లోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు సీఎం కేసీఆర్ త్వరలో మండలానికి రానున్నారు. ఇందుకోసం ప్రాజెక్టు వద్ద గుల్గొస్తా అతిథిగృహం మరమ్మతు పనులతోపాటు గార్డెన్, పెయింటింగ్ పనులు, సుల్తాన్నగర్ గ్రామశివారులో హెలీప్యాడ్ పనులను కలెక్టర్ శరత్ గురువారం పరిశీలించారు. ముందుగా ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నాగమడుగు మత్తడి నిర్మించనున్న మంజీరా పరీవాహాక ప్రాంతాన్ని, రైతులతో నిర్వహించనున్న సభా స్థలాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండేతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వారి వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, నీటి పారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, డీఎస్పీ జైపాల్రెడ్డి, ఈఈ రమేశ్, డీఈఈ దత్తాద్రి, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచులు ఖాసింసాబ్, కంసవ్వ తదితరులు ఉన్నారు.