నందికొండ, ఏప్రిల్ 7 : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. నందికొండ హిల్కాలనీ విజయపురి పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 2500 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని దారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.37.73లక్షల నగదు, రూ.3.5లక్షల విలువైన మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 39రూట్లలో 346పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 2500మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐ గౌరునాయడు, ఎస్ఐ నర్సింహారావు పాల్గొన్నారు.