కోల్కతా/న్యూఢిల్లీ, మే 6: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దరిమిలా హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తంగా మారిన పశ్చిమ బెంగాల్లో.. తాజాగా గురువారం విదేశాంగశాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రి కారుతోపాటు, కాన్వాయ్లోని మరికొన్ని కార్ల అద్దాలు పగిలాయి. రెండు మూడు రోజుల కిందట దాడుల్లో మరణించిన, గాయపడిన బీజేపీ కార్యకర్తలను, వారి కుటుంబాలను పరామర్శించేందుకు మురళీధరన్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని పంచ్కురి గ్రామానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక తృణమూల్ కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులు, రేప్లు చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. తన కాన్వాయ్పై దాడి కూడా తృణమూల్ గూండాల పనేనని ట్విట్టర్లో మురళీధరన్ ఆరోపించారు. తాను సురక్షితంగానే బయటపడ్డానని, తన డ్రైవర్ గాయపడ్డారని పేర్కొన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కూప్పకూలాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కేంద్ర మంత్రిపైనే దాడి జరిగిందంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు, రేప్లు జరుగుతున్నాయని, వేలాది మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బెంగాల్ నుంచి పొరుగు రాష్ర్టాలకు పారిపోతున్నారని చెప్పారు.
బెంగాల్లో కేంద్ర హోంశాఖ కమిటీ పర్యటన
బెంగాల్లో హింసాకాండకు కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ నలుగురు ఉన్నతాధికారులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు, రాష్ట్రంలో శాంతిభద్రతలపై పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను కేంద్ర హోంశాఖ కోరింది.
ఇంకా 24 గంటలు కాలేదు.. అప్పుడే కేంద్రం సాధింపులు: మమత
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖలు, కమిటీలు రావడం మొదలైందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింస చెలరేగటానికి కేంద్రంలోని బీజేపీ నాయకులే కారణమని ఆమె ఆరోపించారు. బెంగాలీలు ఇచ్చిన ప్రజాతీర్పును బీజేపీ ఇంకా జీర్ణించుకోలేదన్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసలో 16 మంది మరణించారు. వారిలో ఎక్కువమంది బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్కు చెందినవారు. ఒకరు సంయుక్త మోర్చా కార్యకర్త ఉన్నార’ని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు.