తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 19:ఆరుతడి పంటలైన కూరగాయల సాగుపై అన్నదాతలు దృష్టిని సారించారు.యాసంగిలో వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గిపోవడంతో ఈ పంటల వైపు ఆసక్తిని కనబరిచారు.ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి పంటలైన టమాట, వంకాయ, బెండ, క్యాబేజీ, మిరప పంటలను పండిస్తూ రైతులు లాభాలు పొందుతున్నారు. రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుండటంతో కూరగాయ పంటలపై మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న డ్రిప్ పరికరాలతో ఆరుతడి పంటలైన కూరగాయలను తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధిస్తూ ఉపాధి పొందుతున్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన రైతు చెన్నయ్యకు గ్రామ శివారులో ఎకరం వ్యవసాయ పొలం ఉంది. వరిపంటకు ఎక్కువ నీరు కావాల్సి వస్తుండటంతో కూరగాయలు పండించడానికి సిద్ధమయ్యాడు. దీనికి తోడు ఉద్యానవన శాఖాధికారులు సబ్సిడీపై పరికరాలు అందించడానికి ముందుకు వచ్చారు. తన వాటాగా రూ.12 వేలు రైతు చెల్లిస్తే ఉద్యానవన శాఖాధికారులు రూ.88వేలు సబ్సిడీపై అందజేశారు. సబ్సిడీ నిధులతోనే డ్రిప్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నాడు. వంకాయ, క్యాబేజీ, మిరప, టమాట, బెండ విత్తనాలు వేశాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతూ తన కుటుంబ సభ్యులను పోషించుకుంటున్నాడు.మల్కాపూర్లో 70శాతం మంది రైతులు ఇలాగే ఉపాధిని పొందుతున్నారు.
డ్రిప్సాగుతో లాభాలు
రూ.12 వేలు చెల్లిస్తే ఉద్యా నవన శాఖా ధికారులు రూ.88 వేల సబ్సిడీపై అందజేశారు. ఏడాదికి రెండు పంటలు పండి స్తూ లాభాలు పొందుతున్నాం. ఎకరం పొలంలో 2 పంటలకు కలిపి రూ.2లక్షల ఆదాయం వస్తున్నది.
– చెన్నయ్య ,రైతు
ఇవీ కూడా చదవండి…