న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు సిగరెట్ లేదా బీడీ తాగే వారికి భారీగా ఫైన్ విధించడానికి రైల్వేశాఖ సన్నద్ధం అవుతున్నది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లితే వారిని అరెస్ట్ చేసే అంశాన్ని కూడా చురుగ్గా పరిశీలిస్తున్నది. ఇటీవల శతాబ్ది ఎక్స్ప్రెస్ బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ నెల 13వ తేదీన న్యూఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఎస్5 బోగీలో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. టాయిలెట్లోని డస్ట్బిన్లో గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడేసిన సిగరెట్/ బీడీతో అక్కడున్న టిష్యూ పేపర్లు నిప్పంటుకుని మంటలు చెలరేగినట్లు విచారణ అధికారుల దర్యాప్తులో తేలింది.
ఇటీవల రైల్వే బోర్డు సభ్యులతో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలోనూ ప్రయాణికుల స్మోకింగ్ అంశం చర్చకొచ్చింది. రైళ్లలో స్మోకింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఈ నేపథ్యంలో స్మోకర్లపై భారీ ఫైన్ విధించాలని ఆలోచిస్తున్నామని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు, తోటి ప్రయాణికులను ప్రాణాలను పణంగా పెట్టే వ్యక్తులను అరెస్టు చేయాలని కూడా యోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రైళ్లలో పొగతాగితే రూ.100 వరకు జరిమానా విధిస్తున్నారు.