ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెగా మంత్రివర్గంలో రైల్వే, ఐటీశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ నూతన రైల్వే మంత్రిగా అదేవిధంగా సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖకు అధిపతిగా వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం బుధవారం వెల్లడించారు. 1994 బ్యాచ్కు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అశ్వినీ వైష్ణవ్ 15 సంవత్సరాలకు పైగా వివిధ రంగాల్లో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించాడు. మౌలిక సదుపాయాల కల్పనరంగంలో పీపీఈ ఫ్రేమ్వర్క్లో ఆయన విశేష కృషి చేశారు. జనరల్ ఎలక్ట్రిక్, సిమెన్స్ వంటి ప్రధాన గ్లోబల్ కంపెనీలలో నాయకత్వ బాధత్యల్లో పనిచేశారు. అశ్వినీ వైష్ణవ్ వార్టన్ స్కూల్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఐఐటి కాన్పూర్ నుండి ఎంటెక్ పూర్తి చేశారు.