బెంగళూరు: రైల్వే ప్రయాణికులకు స్టేషన్లలో ఆహ్లాదకర అనుభూతిని పంచేందుకు భారతీయ రైల్వే మరో అడుగు ముందుకు వేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన అక్వేరియం టన్నెల్ను గురువారం ప్రారంభించింది. ఇండియన్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్డీసీ) దేశంలోనే తొలిసారిగా బెంగళూరు రైల్వే స్టేషన్లో కదిలే ప్రెష్ వాటర్ టన్నెల్ అక్వేరియంను ఏర్పాటు చేసింది. హెచ్ఎన్ఐ అక్వాటిక్ కింగ్డమ్ సహకారంతో అమెజాన్ రివర్ కాన్సెప్ట్ ఆధారంగా తీర్చిదిద్దిన 12 అడుగుల పొడవైన అక్వాటిక్ కింగ్డమ్ రైల్వే ప్రయాణికులకు ఎంతో కనువిందు చేస్తుందని పేర్కొంది. దీనిని తిలకించేందుకు ప్రతి ప్రయాణికుడికి ప్రవేశ రుసుం రూ.25 అని వెల్లడించింది. కరోనా నిబంధనల నేపథ్యంలో 25 మంది చొప్పున లోనికి అనుమతిస్తున్నట్లు తెలిపింది.
రైళ్ల కోసం వేచి ఉండే ప్రయాణికులకు వినోదం కల్పించడంతోపాటు రైల్వేకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఐఆర్ఎస్డీసీ తెలిపింది. ఎయిర్పోర్టుల మాదిరిగా రైల్వే స్టేషన్లను సకల సౌకర్యాలు, వినోద భరితంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.