షిల్లాంగ్ : కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పు ఖాసీహిల్స్ జిల్లాలో ఐదు రోజుల పాటు మేఘాల ప్రభుత్వం కంప్లీట్ లాక్డౌన్ విధించింది. బుధవారం రాత్రి నుంచి మే పదో తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో వారాంతపు లాక్డౌన్ను సైతం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘నియంత్రణ చర్యలు అమలు చేసినప్పటికీ.. ప్రజల కదలికలను తగ్గించింది. పరిస్థితిని అరికట్టడానికి ఇంకా కఠిన చర్యలు అమలు చేయాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. బుధవారం రాష్ట్రంలో 268 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసులు 2,100కు చేరాయి. షిల్లాంగ్లో ప్రస్తుతం కొవిడ్ రోగులతో ఆసుపత్రుల్లో 60 శాతం పడకలు నిండాయని సీఎం సంగ్మా తెలిపారు. నియంత్రణ చర్యలు తక్షణ ఫలితాలు చూపలేదని, కేసుల్లో తగ్గుదల ఉండేలా కఠినమైన చర్యలు అవసరమని సంగ్మా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అసోం ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. గువాహటిలో ఎనిమిది వార్డులను కొవిడ్ హాట్స్పాట్లుగా గుర్తించారు.