ఒకప్పుడు సాగునీటికే కాదు.. తాగునీటికి సైతం తండ్లాడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంతా న్ని ఎదురెక్కి వచ్చిన కాళేశ్వర గంగ సస్యశ్యామలం చేస్తున్నది. ఒక్కొక్కటిగా చెరువులను నింపుతూ ఏండ్ల నాటి గోస తీర్చుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో దశాబ్దాల కలను సాకారం చేసింది. సిద్దిపేట జిల్లాలోని తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి కాలువల ద్వారా ముస్తాబాద్ మండలానికి మొదటిసారి కాళేశ్వర జలాలు రాగా, స్థానిక రైతాంగం పూలతో స్వాగతం పలికి, నీటిని కండ్లకు అద్దుకున్నది. సీఎం కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేసి, అమాత్యుడు రామన్నకు కృతజ్ఞతలు తెలిపింది.
రాజన్న సిరిసిల్ల, మార్చి 5(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల: స్వరాష్ట్రంలో రైతుల కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, లక్షలాది ఎకరాల బీళ్లకు గోదావరిని మళ్లిస్తున్నారు. మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. ముస్తాబాద్ మండల రైతుల గోస చూసి చలించిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 16,500 ఎకరాలకు సాగునీరందిస్తామని 2015 ఫిబ్రవరి 23న మద్దికుంట వేదికగా హామీ ఇవ్వడమే కాకుండా, ఇప్పుడు దానిని నెరవేర్చారు. సిద్దిపేట జిల్లా తొగుట వద్ద తుక్కాపూర్ పంపుహౌస్ నుంచి ఈ నెల 3న ప్రారంభమైన కాళేశ్వర జలాలు దుబ్బాక మండలం రాజక్కపేట కెనాల్ ద్వారా 35 కిలోమీటర్లు ప్రయాణించి, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముస్తాబాద్ మండలం మద్దికుంట ఊర చెరువును చేరాయి. తర్వాత చీకోడులోని చింతల చెరువును తాకాయి. మొదటిసారిగా గోదావరి జలాలు రావడంతో ఈ ప్రాంత రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కాళేశ్వర జలాలు మద్దికుంట ఊరచెరువును తాకగా, 12 చెరువులు నింపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొదట మద్దికుంట లో 62 ఎకరాలకు సాగునీరందించే ఊర చెరువు (10.33 మిలియన్ క్యూబిక్ ఫీట్)తోపాటు చీకోడులో 156 ఎకరాల ఆయకట్టుగల చింతల చెరువు ను నింపుతారు. అక్కడి నుంచి గూడెంలోని 415 ఎకరాల ఆయకట్టు ఉన్న కొండసముద్రం, 84 ఎకరాల ఆయకట్టు ఉన్న బొప్పన్నకుంట, 108 ఎకరాల ఆయకట్టున్న ఎర్రచెరువుకు నీటిని తరలి స్తారు. గొలుసుకట్టు విధానంలో ఆవునూర్లో 310 ఎకరాల ఆయకట్టున్న పెద్ద చెరువును మొదటి విడుత నింపుతారు. ఈ మేరకు ఇప్పటికే ముస్తాబాద్ మండలంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం చేపట్టారు. కొన్ని పిల్ల కాలువల పనులు చేస్తున్నారు. మొత్తంగా 22వేల ఎకరాలకు నీళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
దశాబ్దాల జల స్వప్నం సాకారం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట, చీకోడు గ్రామాలకు వచ్చిన గోదావరి జలాలను చూసి రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంబురపడ్డారు. కాళేశ్వర జలాలను నెత్తిన చల్లుకుని పులకించిపోయారు. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితోనే తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. మద్దికుంట చెరువు వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ఇక ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు.
ఎండలకు బోర్లు ఎండిపోతున్నయి. ఇసోంటి టైంల నీళ్లు వచ్చుడు శానా మంచిదైంది. ఎత్తుమీద ఉన్న మాకు నీళ్లు రావడం నమ్మబుద్దయితలేదు. సీఎం కేసీఆర్ రైతుకు అన్ని సౌలత్లు చేస్తూ రాజును చేస్తున్నడు. మద్దికుంటల మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సార్లు మీటింగ్ పెట్టి నీళ్లు ఇస్తమన్నరు. ఆ మాట ప్రకారం మాకు నీళ్లు ఇస్తున్నరు.
– కుర్థుల బక్కయ్య, మద్దికుంట రైతు