న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యాక్సిన్ పంపిణీ వ్యూహం కాదని..వ్యాక్సిన్ ఇవ్వడంలో వివక్ష ధోరణిని తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18-45 సంవత్సరాల వారికి ఉచిత వ్యాక్సిన్ భరోసా లేదని, ధరల నియంత్రణ లేకుండా దళారులు వీటిని కొనుగోలు చేసేందుకు అనుమతించారని ఆందోళన వ్యక్తం చేశారు. బలహీనవర్గాలకు వ్యాక్సిన్ కు ఎలాంటి హామీ లేదని దుయ్యబట్టారు.
కేంద్రం తీరు వ్యాక్సిన్ పంపిణీ వ్యూహంలా లేదని వ్యాక్సిన్ ఇవ్వడంలో వివక్షకు తెరలేపిందని రాహుల్ ట్వీట్ చేశారు. ఇక 18 ఏండ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ అందచేసేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తయారీదారుల నుంచి రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు, పరిశ్రమ సంస్థలు నేరుగా వ్యాక్సిన్ డోసులను సమీకరించేందుకు అనుమతించింది.