రేపు కేంద్రమంత్రి తోమర్
నుంచి అవార్డుల స్వీకరణ
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు మరోసారి జాతీయస్థాయిలో ప్రత్యేకత చాటాయి. ఒక గ్రామ సమాఖ్యతోపాటు రెండు మహిళా పొదుపు సంఘాలు జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 30 ఉత్తమ మహిళా సంఘాలను ఎంపికచేయగా.. వాటిలో తెలంగాణ నుంచి రెండు చోటుసంపాదించాయి. వీటిలో కామారెడ్డి జిల్లా ఉగ్రవాయికి చెందిన శ్రీ బాలాజీ పొదుపు సంఘం, రంగారెడ్డి జిల్లా చిలుకూరుకు చెందిన ప్రగతి పొదుపు సంఘం ఉన్నాయి. దేశవ్యాప్తంగా పది గ్రామ సమాఖ్యలను ఎంపికచేస్తే.. తెలంగాణ నుంచి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ముండ్రాయి గ్రామ సమాఖ్య చోటుదక్కించుకున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా (మార్చి 8న) సోమవారం వర్చువల్ విధానంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అ వార్డులను ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ముగ్గు రు అవార్డులు అందించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశా ఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కుమార్ సుల్తానియా అవార్డుకు ఎంపికైన గ్రామ సమాఖ్య, పొదుపు సంఘాలను అభినందించారు.
గ్రూపుతో కష్టాలు తీరినయి
మా సంఘాన్ని 1999 జూలై 30లో ప్రారంభించాం. గతంలో మాకు డబ్బులు కావాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నంక కష్టాలు తీరినయి. సంఘంలోని ఒక్కొక్కరం ఒక్కొ రకమైన వ్యాపారం చేసుకుంటున్నాం. బ్యాంకు నుంచి రూ.7.50 లక్షల లోను తీసుకునే స్థాయికి వచ్చినమంటే ఇదంతా ఒక్కరోజులో సాధ్యంకాలేదు. 20 ఏండ్ల నుంచి చేసుకుంటున్నాం. మాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.
-లక్ష్మి, శ్రీ బాలాజీ పొదుపు సంఘం, కామారెడ్డి జిల్లా
రూ.51.10 లక్షల రుణాలు తీసుకున్నాం
సంఘం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు బ్యాంకు ద్వారా రూ.51.10 లక్షల రుణాలు తీసుకున్నాం. తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులో జమచేస్తు న్నాం. మా సంఘాన్ని జాతీయస్థాయిలో ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సంఘం ఉత్తమ ప్రతిభ కనబర్చడానికి సభ్యుల అందరి కృషే కారణం. అధికారులు కూడా ఎంతో సహకరించారు. సంఘాన్ని మరింత సక్రమంగా నిర్వహిస్తాం.