హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధిపై దృష్టి సారించిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఒలింపిక్స్ డే సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒలింపిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. క్రీడల అభివృద్ధి లో భాగంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మినీ స్టేడియంల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 శాతం స్టేడియాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడా పాలసీని తయారు చేయటానికి సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారని గుర్తు చేశారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్లో రాణించిన క్రీడాకారులకు గత ప్రభుత్వాలు నామ మాత్రంగా సహాయ సహకారాలు అందించాయన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నామన్నారు. క్రీడాకారులకు ఉన్నత విద్యలో ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొంటున్న తెలంగాణ క్రీడాకారులు సానియా మీర్జా, సాయి ప్రణీత్ లు సత్తాచాటి తెలంగాణ రాష్ట్రం కీర్తి ప్రతిష్టలను పెంచాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడా సంఘాలకు క్రీడా శాఖ ద్వారా ఎంతో ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. ఒలింపిక్స్ అసోసియేషన్ ద్వారా క్రీడల అభివృద్ధికి చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. కరోనా మహమ్మారి వల్ల క్రీడాకారులు తమ ఫిట్నెస్ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల కరోనా మహమ్మారితో చనిపోయిన క్రీడా దిగ్గజం మిల్కాసింగ్ తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్ సభ్యులు, స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్ సలీంలకు సంతాపం ప్రకటించారు. 2 నిమిషాల మౌనం పాటించి వారి సేవలను స్మరించుకున్నారు.
ఈ జూమ్ మీటింగ్లో తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ సీనియర్ అసోసియేషన్ సభ్యులు సముద్రాల వేణుగోపాల చారి, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, ప్రేమ్ రాజ్, హ్యాండ్ బాల్ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రావు, బాస్కెట్ బాల్ అసోసియేషన్ శ్రీధర్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ బేగ్ , వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, శాట్స్ అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.