న్యూఢిల్లీ : కొవిడ్-19 విస్తృత వ్యాప్తితో విదేశీ వ్యాక్సిన్లకు కేంద్రం ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం స్పందించారు. గతంలో రాహుల్ విదేశీ వ్యాక్సిన్లను అనుమతించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీజీసీఐ) అత్యవసర వాడకానికి అనుమతించిన క్రమంలో రాహుల్ ట్వీట్ చేశారు. ’ వారు (కేంద్ర ప్రభుత్వం) ముందు మిమ్మల్ని పట్టించుకోరు..ఆపై మిమ్మల్ని చూసి ఎద్దేవా చేస్తారు..ఆ తర్వాత మీతో పోరాడుతారు..ఆపై మీరు గెలుపొందుతార’ని రాహుల్ వ్యాఖ్యానించారు.
కాగా, దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల్లో తయారైన కొవిడ్ వ్యాక్సిన్లను భారత్కు రప్పించాలని కొద్దిరోజుల కిందట రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే ఈ లేఖపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాహుల్ ఫార్మా కంపెనీల తరపున లాబీయింగ్ చేస్తున్నారని విరుచుకుపడింది. ఇక కరోనా కేసులు పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన విదేశీ వ్యాక్సిన్లను దేశంలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్కు వీలైనంత త్వరలో సరఫరాలు చేపట్టేలా ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సహా పలు విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్ధలను ఆహ్వానిస్తామని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.