న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెల 28న కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆయన గురు, శుక్రవారాల్లో పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాలేదని పేర్కొన్నాయి. రాహుల్ ఏప్రిల్ 20న కరోనా పాజిటివ్గా పరీక్షించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సైతం రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పాయి. ప్రియాంకగాంధీ మే నెలలో తన మొదటి డోసు టీకా తీసుకున్నారు. కాగా, దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ వ్యూహంపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, రాహుల్ కొవిడ్ టీకా ఎందుకు తీసుకోవడం లేదని గతంలో బీజేపీ నాయకుడు సంబిత్ పాత్రతోపాటు పలువురు ప్రశ్నించారు.
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మందగించడానికి రాహుల్ గాంధీ కారణమని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ఆరోపించారు. రాహుల్ గాంధీ, అతని కుటుంబసభ్యులు టీకాలు తీసుకున్నారో? లేదో? సకాలంలో సమాచారం ఇచ్చి ఉంటే చాలామంది కరోనాతో చనిపోయేవారు కాదని, ప్రజల మనసులో సందేహాలు సృష్టించినందువల్లే వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగిందని మీనాక్షి విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాక్సిన్ తీసుకొని సస్పెన్స్కు తెరదించారు. మరో వైపు కేరళలో పెరుగుతున్న కరోనా కేసులపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అన్ని భద్రతా చర్యలను అనుసరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.