న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శనివారం మరో ట్రాక్టర్ ర్యాలీకి సన్నద్ధమవుతున్న తరుణంలో అన్నదాతలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన రైతులకు తాను వెన్నంటి ఉంటానని రాహుల్ ట్వీట్ చేశారు. సత్యాగ్రహులుగా తాము ఈ దేశ రైతుల వెంట నడుస్తామని రాహుల్ స్పష్టం చేశారు. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు ఏడు నెలలకు చేరడంతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు రైతులు మరోసారి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.
సిసౌలీలోని బీకేయూ కార్యాలయం నుంచి బయలుదేరే ట్రాక్టర్ ర్యాలీ యూపీ గేట్ మీదుగా ఘజియాబాద్ చేరుకునేలా రైతు సంఘాల నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఆయా రూట్లలో రైతులు తమ ట్రాక్టర్లతో ప్రదర్శనలో కలుస్తారు. వ్యవసాయ చట్టాల రద్దుకు ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారని బీకేయూ నేత రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను తొలగించాలని కోరుతూ రైతులు రాష్ట్రాల గవర్నర్లకు వినతిపత్రాలు సమర్పిస్తారని చెప్పారు.