న్యూఢిల్లీ : మోదీ సర్కార్ అసమర్ధ విధానాలతోనే కొవిడ్-19 సెకండ్ వేవ్కు దారితీసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విలువైన సూచనలను అహంకార ధోరణితో కూడిన కేంద్ర సర్కార్ చెవికెక్కించుకవడం లేదని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు వలస కూలీల చేతుల్లో నగదు ఉంచాలని రాహుల్ ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడిందని వలస కూలీలు మరోసారి వలసల బాటపట్టే పరిస్ధితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంతో పాటు వలస కూలీలకు నగదు సాయం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరారు. ఇక కరోనా కేసుల పెరుగుదలతో ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో లాక్డౌన్ విధించవచ్చనే వార్తలతో వలస కూలీలు తిరిగి స్వరాష్ట్రాలకు తరలివెళుతున్నారు.