న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసేందుకు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం వెన్నుచూపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగింపుపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ స్పందనపై ఓ వార్తా పత్రిక కధనాన్ని జోడిస్తూ రాహుల్ శనివారం ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలు ముప్పు ముంగిట్లో ఉంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేందుకు ఎలాంటి డెడ్లైన్లు లేవని ప్రభుత్వం చెబుతోందని, ఇది సర్కార్ వెన్నుచూపుతోందనడానికి సరైన నిదర్శనమని రాహుల్ ఎద్దేవా చేశారు.
కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు నిర్ధిష్ట కాలపరిమితి అంటూ లేదని, అయితే 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ చేపడతామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ తాజాగా ట్వీట్ చేశారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.