కరీంనగర్, మార్చి22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా సంక్షోభం చుట్టుముట్టినా.. ఇంకా వెంటాడుతున్నా తెలంగాణ సర్కారు ఉద్యోగులకు 11వ పీఆర్సీ (వేతన సవరణ)ను ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందులను పక్కన పెట్టి.. అన్ని వర్గాల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల విజ్ఞప్తి మేరకు 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. వీటితోపాటు పలు వరాలను సోమవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించారు. ఫిట్మెంట్, 12 నెలల పీఆర్సీ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కలిపి పొందడం, వయో పరిమితి పెంపు, ఉపాధ్యాయ బదిలీలకు గ్రీన్సిగ్నల్, ప్రాథమిక పాఠశాలలకు కొత్త హెచ్ఎం పోస్టులు, 12 లక్షల నుంచి 16 లక్షలకు గ్రాట్యుటీ పెంపు, కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళలకు ఆరు నెలల ప్రసూతి సెలవులు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల కుటుంబ సభ్యులకు వర్తింపు, వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఫిట్మెంట్ వర్తింపు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీం నూతన విధి విధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై ఉమ్మడి జిల్లాకు జరిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
లక్ష మందికి ఫిట్మెంట్
30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ముఖ్యమంత్రి.. కేవలం ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు మాత్రమే కాకుండా.. వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి కూడా వర్తింపజేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాగంలో భాగమై పనిచేస్తున్న హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీల్లో పని చేస్తున్న సిబ్బంది, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు.. ఇలాంటి వారందరికీ వేతన పెంపును వర్తింపజేయనున్నారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో లక్షకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లాలో 12,500 పైచిలుకు ఉపాధ్యాయులు, 16 వేల మంది ఉద్యోగులు, 25 వేల పై చిలుకు పెన్షనర్లు ఉన్నారు. అలాగే, వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 48 వేల పైచిలుకు మంది పనిచేస్తున్నారు. సీఎం ప్రకటించిన నిర్ణయం ప్రకారం చూస్తే.. 1.01 లక్షల మందికి 30 శాతం ఫిట్మెంట్ వర్తించనున్నది.
పెన్షర్లకు పెద్ద ప్రయోజనం..
ప్రభుత్వ రంగంలో పనిచేసి.. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ప్రస్తుతం 75 ఏళ్లకు అదనపు (అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్) పెన్షన్ పెంచుతున్నారు. ఉదాహరణకు.. ఒక రిటైర్డ్ ఉద్యోగి బేసిక్ పెన్షన్ 40 వేలుంటే ఇన్నాళ్లూ అతనికి లేదా ఆమెకు 75 ఏళ్లు నిండిన తదుపరి మాత్రమే సదరు బేసిక్ పెన్షన్పై 15 శాతం పెంచేవారు. అంటే ఆరువేల వరకు పెరిగేది. ప్రస్తుతం దీనిని ఐదేళ్లు తగ్గించి.. అంటే 70 ఏళ్లకే బేసిక్ పెన్షన్పై 15 శాతం పెంచనున్నారు. ఇది రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూర్చనున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 25 వేల మంది పెన్షనర్లు ఉండగా.. అందులో 9 వేల పైచిలుకు 70 ఏళ్లు దాటిన వారున్నారు. తక్షణం వీరందరికీ లబ్ధి చేకూరనుండగా, భవిష్యత్లో పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికీ మేలు జరగనున్నది.
ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా
ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పదోన్నతుల ప్రక్రియను ఏకీకృత పద్ధతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం పలుసార్లు ప్రకటించినా.. పంచాయతీరాజ్, ప్రభుత్వోపాధ్యాయల మధ్య విభేదాలు తలెత్తడం, కోర్టుకు వెళ్లడం వంటి కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం యాజమాన్యాల వారీగా నిర్వహించాలని నిర్ణయించడంతో లైన్ క్లియర్ అయింది. దీనివల్ల ప్రభుత్వ, పంచాయతీ రాజ్ ఉపాధ్యాయలకు కలిపి సుమారు 1200కుపైగా పంతుళ్లకు పదోన్నతులు రానున్నాయి.
ప్రాథమిక బడులు పటిష్టం
ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎం పోస్టులను మంజూరు చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 1977 ప్రాథమిక పాఠశాలలున్నాయి. నిజానికి 1998లో అప్పటి సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాల్లో 10 వేల హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. మహిళా అక్షరాస్యతా శాతం (లో లిటరసీ ఫిమేల్) తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ పోస్టులను మంజూరు చేసింది. మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వీటిని మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో 320 వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇవన్నీ భర్తీ కానున్నాయి. అంతేకాదు, ఈ పోస్టుల మంజూరుతో ప్రస్తుతం పని చేస్తున్న ఎస్జీటీలు హెచ్ఎంలుగా పదోన్నతులు పొందనున్నారు. దీనివల్ల ఆయా పాఠశాలలకు ఒక అదనపు పోస్టు మంజూరు కానున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా బలోపేతమవుతాయి. అలాగే వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులను ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా ఉత్తర్వులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
కేజీబీవీ ఉద్యోగినులకు వరం
ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో 1200 మంది మహిళలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఇన్నాళ్లూ ప్రసూతి సెలవుల కింద నాలుగు నెలలు ఇచ్చే వారు. ఆ నెలలకు వేతనాలు కట్చేసే వారు. తాజాగా, వేతనంతో కూడిన ఆరునెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించడం వారికి వరంగా మారింది. ప్రస్తుతం నడుస్తున్న కేజీబీవీల్లో 20 నుంచి 30 ఏళ్ల వయసు ఉద్యోగినులే ఎక్కువగా పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం చంటి పిల్లలను తీసుకొని రావడానికి నిబంధనలు ఒప్పుకోవు. నాలుగు నెలల ప్రసూతి సెలవులున్నా.. వేతనాలు రాకపోవడంతో సదరు కుటుంబాలు ఇబ్బందులు పడేవి. ప్రస్తుతం ఈ కష్టాలకు ముఖ్యమంత్రి చెక్ పెట్టారు. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతో సదరు ఉద్యోగినుల కుటుంబాలకు భరోసా ఇచ్చినట్లయింది.
కొత్త పెన్షన్దారుల కుటుంబాలకు భరోసా
ముఖ్యమంత్రి ప్రకటించిన ముఖ్యమైన నిర్ణయాల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేస్తూ ప్రకటన చేశారు. నిజానికి 2004 సెప్టెంబర్ నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం అమల్లోకి వచ్చింది. అంతకుముందున్న వారందరికీ పాత పెన్షన్ వర్తిస్తుంది. 2004 సెప్టెంబర్ నుంచి రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ వర్తించదు. కానీ, తాజాగా కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీంను సదరు కుటుంబ సభ్యులకు వర్తింపజేస్తున్నట్లుగా ప్రకటించారు. కొన్ని వేలాది కుంటుబాలకు ఈ నిర్ణయం కొండంత అండగా నిలువనున్నది.
కలసి రానున్న మూడేళ్ల సర్వీస్
రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్నారు. ప్రస్తుతం కొలువు చేస్తున్న ప్రతి ఉద్యోగికీ అదనంగా మరో మూడేళ్ల సర్వీస్ కలసి రానున్నది. ఇదే సమయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వచ్చే మూడేళ్లలో రిటైర్డ్ అయ్యే వారు సుమారు 7,400 మంది ఉన్నారు. ఈ యేడాది డిసెంబర్ నాటికి సుమారు 2300 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. 2022, 2023లో 5,100 మంది ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వీరందరికీ కలిసి రానున్నది.