మహబూబ్నగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ మహమ్మారికి భయపడి ప్రపంచమే వణికిపోతోం ది. దేశంలో పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు నమోదవుతున్న తరుణంలో జనం ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో చిన్న అనుమానం వచ్చినా జనం దవాఖానలకు ప రుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొన్ని ప్రై వేటు దవాఖానలు వారి భయాన్ని సొమ్ము చేసుకుంటున్నా యి. పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు బుక్ చేసుకునేందుకు, బ్లాకులో రెమెడిసివిర్ ఇంజక్షన్ల కొనుగోళ్లు.. అంటూ రోగు ల నుంచి కొన్ని ప్రైవేటు దవాఖానల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలోని పలుచోట్ల రోగులు ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నా తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు మాత్రం అద్భుతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేకంగా కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కొవిడ్ బారినపడిన క్రిటికల్ రోగాలను సైతం నయం చేసి ఇంటికి పంపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అద్భుతం గా సేవలు అందిస్తున్నారని.. ప్రభుత్వం సకల సదుపాయాలు ఏర్పాటు చేసిందని, అక్కడ చికిత్స పొంది నయమై వచ్చిన వ్యక్తులే చెబుతున్నారు. ఆక్సిజన్, ఐసీయూ పడకలు, అందుబాటులో రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న ఓ మహిళ తనకు చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన గద్వాల జిల్లా దవాఖాన ఆవరణలో వైద్యుల సేవలకు గుర్తుగా మొక్కనాటి ఇంటికి వెళ్లింది. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న సేవలకు ఇదే చక్కని గుర్తింపుగా చెప్పొచ్చు. ఉమ్మడి జిల్లాలో కొవిడ్ సేవల కోసం ప్రభుత్వం 804 పడకలను సిద్ధంగా ఉంచగా… గురువారం సాయంత్రం నాటికి 289 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా 515 ఖాళీగా ఉన్నాయి. అందుకే జనం ఎలాంటి ఆందోళన లేకుండా ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ చికిత్సకు రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.
హైదరాబాద్ కంటే చక్కని సేవలు
ఈ నెల 16న నాకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. డయాబెటిక్ ఉండడంతో చాలా భయమేసింది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతోపాటు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. హైదరాబాద్లో దవాఖానల పరిస్థితి చూస్తే ఇబ్బందిగా అనిపించింది. మా తల్లిగారి ఇల్లయిన గద్వాలలో చక్కని వైద్య సేవలందిస్తున్నారని మా బంధువులు చెప్పారు. 21న జాయిన్ అయ్యాను. నా భయాన్ని పటాపంచలు చేస్తూ అద్భుతంగా వైద్యసేవలు అందాయి. ప్రభుత్వ దవాఖానల్లో అద్భుత సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ కంటే గద్వాలలోనే చాలా చక్కగా వైద్యసేవలు అందాయి. – సుజాత, ఈసీఐఎల్, హైదరాబాద్