పశ్చిమ బెంగాల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కోల్కతా ఎయిర్పోర్ట్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వాళ్ల వద్ద ఉన్న రేడియోధార్మిక మెటిరియల్ను స్వాధీనం చేసుకుంది. అటామిక్ ఎనర్జీ యాక్ట్ ప్రకారం.. రేడియోధార్మిక పదార్థాలను సాధారణ వ్యక్తులు కలిగి ఉండటం నేరం. అవి చాలా ప్రమాదకరమైనవి, చాలా ఖరీదైనవి. అణు ఉత్పత్తి, ఇతర ఎనర్జీ ఉత్పత్తి కోసం దాన్ని వాడుతారు. అయితే.. ఇవి ల్యాబ్లలో మాత్రమే ఉండాలి.
ఎయిర్పోర్ట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వీళ్లను క్రైమ్ డిపార్ట్మెంట్ చెక్ చేయగా.. వీళ్ల వద్ద నాలుగు పీసుల రేడియోధార్మిక మెటిరియల్ లభించింది. దీంతో దాన్ని సీజ్ చేసి వెంటనే వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర ఉన్న ఆ మెటిరియల్ విలువ 4250 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేరే వ్యక్తి సూచన మేరకు.. ఎయిర్పోర్ట్ దగ్గర దాన్ని అమ్మేందుకు ఈ ఇద్దరు ప్రయత్నించారు. ఆ సమయంలోనే అధికారులకు దొరికిపోయారు.
సీజ్ చేసిన రేడియోధార్మిక మెటిరియల్లో ఒకటి కాలిఫోర్నియం అని అధికారులు గుర్తించారు. అది చాలా విలువైందని.. ఒక గ్రాము కాలిఫోర్నియం.. 170 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే.. 250 గ్రాముల ఇతర రేడియోధార్మిక పదార్థాలను కర్ణాటకలో కొనుగోలు చేసినట్టు నిందితులు వెల్లడించారు.
ఏదైనా లాబొరేటరీ నుంచి ఈ మెటిరియల్ను నిందితులు దొంగలించి ఉంటారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతాం.. అని అధికారులు స్పష్టం చేశారు.