న్యూఢిల్లీ: డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని ( Radhakishan Damani ) ఇప్పుడు బిలియనీర్ల జాబితాలో చేరాడు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని వంద మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం సంపాదించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. దమాని ప్రస్తుత ఆస్తి విలువ సుమారు 19.3 బిలియన్ల డాలర్లు. ప్రపంచంలోని వంద మంది సంపన్నుల జాబితాలో ఆయన 97వ ర్యాంక్లో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సంపద 30 శాతం పెరిగింది. డీమార్ట్ స్టాక్ విలువ పెరగడంతో.. ఆయన సంపాదన కూడా రెట్టింపు అయ్యింది.
డీమార్ట్ పేరుతో హైపర్మార్కెట్ చైన్ను దమాని నడిపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, దుస్తులు, కస్టమర్ వస్తువులను ఆ దుకాణాల్లో అమ్ముతుంటారు. 2020 ఆర్థిక సంవత్సరంలో .. డీమార్ట్ పేరెంట్ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ సుమారు 25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
దమాని ముంబైలో పుట్టారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా తన వ్యాపారాన్ని వృద్ధి చేశారు. 2000 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ను వదిలిన ఆయన.. మల్టీ బిలియన్ రిటేల్ సామాజ్రాన్ని స్థాపించారు. 2002లో తొలిసారి డీమార్ట్ స్టోర్ ఓపెనైంది. నవీ ముంబైలోని పొవాయిలో ఆ షాపును ఓపెన్ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, చత్తీస్ఘడ్, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుమారు 238 డీమార్ట్ రిటేల్ దుకాణాలు ఉన్నాయి.
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ జాబితాలో భారత్కు చెందిన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆజిమ్ ప్రేమ్జీ, పల్లోంజి మిస్త్రీ, శివ్ నాడర్, లక్ష్మీ మిట్టల్ ఉన్నారు.