న్యూఢి్ల్లీ : థర్డ్ వేవ్ ముప్పు తప్పదనే ఆందోళనల నడుమ కరోనా వైరస్ సంక్రమణ వేగాన్ని సూచించే ఆర్-వ్యాల్యూ గత రెండు వారాల్లో 1.2కు ఎగబాకింది. కేరళ, మహారాష్ట్రలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆర్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతున్నదని తాజా అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. ఆగస్ట్ 14-17 మధ్య 0.89గా ఉన్న ఆర్ వ్యాల్యూ ఆగస్ట్ 24-29 మధ్య 1.17కు పెరగ్గా ఆగస్ట్ 30 నాటికి ఇది 1.2కు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్(చెన్నై)కు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
ఆగస్ట్లో కేరళ, మహారాష్ట్ర, మిజోరం, జమ్ము కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఆర్ వ్యాల్యూ 1కి పైగా పెరగడం పరిస్ధితి తీవ్రతకు దారితీస్తోందని పరిశోధకుల బృందానికి నేతృత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా చెప్పారు. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదైన కేరళలో ఆర్ వ్యాల్యూ 1.33 కాగా, మిజోరంలో 1.36, జమ్ము కశ్మీర్లో 1.25, మహారాష్ట్రలో 1.06, ఏపీలో 1.09గా ఉంది.
కరోనా వైరస్ సోకిన వారు ఎంతమందికి వైరస్ను వ్యాప్తి చేస్తారనేది వెల్లడించే సంకేతంగా రీప్రొడక్షన్ నెంబర్ (ఆర్ వ్యాల్యూ)ను పరిగణిస్తారు. సగటు ఆర్ వ్యాల్యూ తక్కువగా ఉంటే వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్టు పరిగణిస్తారు. ఆర్ వ్యాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటే వైరస్ సోకే వారు అధికమయ్యే దశను ఎపిడెమిక్ దశగా పిలుస్తారు.