ఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్ పీవీ సింధును కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు పలువురు కేంద్రమంత్రులు ఘనంగా సన్మానించారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, యువజన వ్యవహారాల మంత్రి నిసిత్ పరమాణిక్, తదితరులు పీవీ సింధుని సన్మానించారు. టోక్యో ఒలింపిక్స్ గేమ్స్లో మహిళల బ్యాట్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం సాధించిన సింధు ఒలింపిక్స్ గేమ్స్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచిన సంగతి తెలిసిందే. టోక్యో నుంచి న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన సింధు, ఆమె కోచ్ పార్క్ టే-సాంగ్ను కేంద్ర మంత్రులు మంగళవారం సన్మానించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పీవీ సింధు భారతదేశపు గొప్ప ఒలింపియన్లలో ఒకన్నారు. భారత ఐకాన్ అని కొనియాడారు. దేశం కోసం ఆడాలనే ప్రతీ భారతీయుడికి సింధూ ఒక ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. వరుస ఒలింపిక్స్ గేమ్స్లో రెండు పతకాలు సాధించి అథ్లెట్స్కు స్ఫూర్తిగా నిలిచారన్నారు. సన్మాన కార్యక్రమంలో సింధూ తల్లిదండ్రులు పి.విజయ, పీవీ రమణ పాల్గొన్నారు.