“చావు కబురు చల్లగా’లో భర్తను కోల్పోయిన మహిళగా అభినయప్రధానంగా నా పాత్ర సాగుతుంది. నటిగా సవాలుగా భావించి చేసిన క్యారెక్టర్ ఇది’ అని చెప్పింది లావణ్య త్రిపాఠి. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. బన్నీవాస్ నిర్మాత. ఈ నెల 19న విడుదలకానుంది. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘ తొలుత నిర్మాత బన్నీవాసు ఈ కథ గురించి నాతో చెప్పినప్పుడు విధవరాలు పాత్రను ఎవరూ పోషిస్తారో అనుకున్నా. లక్కీగా ఆ అవకాశం నాకు దక్కడం ఆనందంగా ఉంది. ఇందులో మల్లిక అనే వైజాగ్ యువతిగా కనిపిస్తా. విడో అయిన ఆమెను చదువులేని బస్తీబాలరాజు పెళ్లిచేసుకోవాలని అనుకుంటాడు. ఆ జంటకు ఎదురైన పరిణామాలేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. నవ్విస్తూనే ఆలోచనను రేకెత్తించే చిత్రమిది. స్వతహాగా నాలో హాస్యచతురత ఎక్కువే. ఎవరైనా బాధలో ఉంటే చూస్తూ కూర్చోలేను. వారిని నవ్వించడానికే ప్రయత్నిస్తా. తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నా. అలాగే తమిళంలో ఓ చిత్రాన్ని అంగీకరించా’ అని తెలిపింది.