డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్సింగ్ ధామిని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షం శనివారం ఎన్నుకొన్నది. అనూహ్య పరిణామాల మధ్య తీరథ్సింగ్ రావత్ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. శనివారం కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ నేతృత్వంలో ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పుష్కర్సింగ్ ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీరాణి మౌర్యను ఆమె నివాసంలో కలుసుకొన్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని తోమర్ తెలిపారు.
రాజ్నాథ్కు సన్నిహితుడు
45 ఏండ్ల పుష్కర్సింగ్ ధామి రక్షణ మంత్రి రాజ్నాథ్కు అత్యంత సన్నిహితుడు. 1975 సెప్టెంబర్ 16న పితోడ్గఢ్లో జన్మించాడు. 2002లో లక్నో యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. ఉదమ్సింగ్నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనను సీఎంగా ఎన్నుకోవడంపై ప్రధాని మోదీ, పార్టీ అధిష్ఠానానికి ధామి కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయ అస్థిరత..
ఉత్తరాఖండ్లో గడిచిన నాలుగు నెలల్లో ముగ్గురు సీఎంలు మారారు. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి సెగతో మార్చిలో అప్పటి సీఎం త్రివేంద్రసింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం ఎంపీ తీరత్సింగ్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఇదిలాఉండగా ఉత్తరాఖండ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని, రాష్ర్టాన్ని రాజకీయ అస్థిరతలోకి నెట్టివేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. తరచూ సీఎంలను మార్చుతూ దేవభూమిని అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ అన్నారు.
20 ఏండ్లలో పది మంది సీఎంలు..
ఉత్తరాఖండ్లో అనూహ్య రాజకీయాలు కొత్తేం కాదు. రాష్ట్రం ఏర్పడి 20 ఏండ్లు అయింది. ఈ 20 ఏండ్లలో పంది మంది సీఎంలు పనిచేశారు. అందులో 9మంది తమ పదవీకాలం ముగియకముందే దిగిపోయారు. కాంగ్రెస్ నేత నారాయణ్ దత్ తివారీ ఒక్కరే 2002-2007 మధ్యకాలంలో పూర్తికాలం సీఎంగా పనిచేశారు.