భువనేశ్వర్: ఒడిశాలో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాముఖ్యతలు కలిగిన పూరీ నగరం మరో ఘనతను దక్కించుకున్నది. దేశంలో పైప్లైన్ ద్వారా 24 గంటల తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిన మొదటి నగరంగా పూరీ గుర్తింపు పొందింది. సోమవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వర్చువల్ పద్ధతిలో సుజల్-డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ను ప్రారంభించడం ద్వారా పూరీ నగరానికి ఈ గుర్తింపు లభించింది.
సుజల్-డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ ప్రారంభం సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. పూరీలో కుళాయిల ద్వారా 24 గంటల మంచి నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, దాంతో ఇప్పటికే ఈ సౌకర్యం అందుబాటులో ఉన్న అంతర్జాతీయ నగరాలు లండన్, న్యూయార్క్, సింగపూర్ సరసన పూరీ చేరిందని చెప్పారు. పూరీలో 24 గంటల నల్లా నీటి సౌకర్యం ఒడిశా అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయమని ఆయన పేర్కొన్నారు.
ఈ సుజల్-డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ ప్రారంభంతో పూరీ నగరానికి చెందిన 2.5 లక్షల మందికి, ఏటా ఆ నగరాన్ని సందర్శించే రెండు కోట్ల మందికి టూరిస్టులకు 24 గంటలు నాణ్యమైన తాగునీరు అందుబాటులో ఉండనుందని పట్నాయక్ చెప్పారు. దాంతో వాటర్ను నిలువ చేయడం, ఫిల్టర్ చేయడం లాంటి ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. నగరంలోని అన్ని మూలల్లో తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా మొత్తం 400 ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఫౌంటెయిన్లు ఏర్పాటు చేసినట్లు ఒడిశా సీఎం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ 5టీ చార్టర్ (ట్రాన్స్పరెన్సీ, టీమ్ వర్క్, టెక్నాలజీ, టైమ్ ఫ్రేమ్, ట్రాన్స్ఫర్మేషన్) లో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాజెక్టు అయిన సుజల్-డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ను మొదలుపెట్టామని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. కేవలం 9 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దాదాపు 40 లక్షల జనాభా గల మరో 16 పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తామని ఆయన వెల్లడించారు. పూరీలో ప్రతి ఏడాది మూడు కోట్ల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు జమ అయ్యేవని, దాదాపు 400 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వేస్ట్ పోగయ్యేదని నవీన్ పట్నాయక్ చెప్పారు. సుజల్ పైప్డ్ వాటర్ స్కీమ్ ప్రారంభంతో ఇక ఆ సమస్య తీరినట్లేనని ఆయన పేర్కొన్నారు.
నాణ్యమైన తాగునీటికి, మంచి ఆరోగ్యానికి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కు, ఎకానమీకి చాలా దగ్గరి సంబంధం ఉన్నదని సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన తాగునీటిని అందించడం కోసం ఒడిశా ప్రభుత్వం గత ఐదేండ్లుగా బడ్జెట్లో నిధులను భారీగా పెంచిందన్నారు. ఐదేండ్ల క్రితం రూ.200 కోట్లుగా ఉన్న తాగునీటి బడ్జెట్ ఈ ఏడాది రూ.4,000 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. జలసాథి ప్రోగ్రామ్ కింద ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నిర్వహణ, తాగునీటి నాణ్యత బాధ్యతలను పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాలే చూసుకుంటాయని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల నుంచి ఎన్నికైన జలసాథీలే నిరంతరం నీటి నాణ్యతను తనిఖీ చేస్తారని చెప్పారు.