మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొడుకు ఈటల నితిన్రెడ్డి భూ కబ్జాకు పాల్పడినట్టు బాధితుడు పిట్ల మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కూడా రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. బాధితుడు మహేశ్ వద్ద ఉన్న పత్రాల ఆధారంగా రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. మేడ్చల్ మండలం రావల్కోల్కు చెందిన పిట్ల మహేశ్ సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాలను ఈటల నితిన్రెడ్డి చెరపట్టినట్టు సీఎం కేసీఆర్కు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్వేతా మహంతి నేతృత్యంలో రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు వేర్వేరుగా విచారణ కొనసాగిస్తున్నారు.
సోమవారం బాధితుడి నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగా రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి ప్రస్తుత పరిస్థితిపై నివేదికలను అందజేశారు. ఈ భూమి 1954 నుంచి 1986 వరకు తన తాత పేరిట రికార్డుల్లో ఉన్నట్టు పిట్ల మహేశ్ చూపుతున్న పత్రాల ఆధారంగా రెవెన్యూ కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలిస్తునే, ఇనాం భూముల వివరాలను సేకరిస్తున్నారు. 1986 వరకు రికార్డుల్లో పిట్ల మహేశ్ తాత పేరిట ఉన్న భూమి ఇతరులకు మారిన పహాణీల మార్పు, రిజిస్ట్రేషన్లు జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. తదుపరి పేర్లు రికార్డుల్లోకి ఎలా వచ్చాయి? ఇనాం భూములకు ఇచ్చిన ఓఆర్సీ జారీచేసిన వివరాలను సేకరిస్తున్నారు. మహేశ్ తాత పిట్ల నర్సింహ తదనంతరం ఇతర పేర్లు వచ్చినవారి రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు. రఘుపతిరెడ్డి, సత్యనారాయణరాజులు ఇనాం భూముల పేరిట ఓఆర్సీ ద్వారా విక్రయాలు జరిపిన విధానంపై నాటి రికార్డులను బయటకు తీస్తున్నారు.
నిరుపేద పిట్ల మహేశ్కు న్యాయం చేసేలా ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కబ్టాదారులపై చర్యలు తీసుకోవాలి. పిట్ల మహేశ్ వైపే తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉంటుంది. సీఎం కేసీఆర్ బాధితుడికి అండగా ఉండి న్యాయం చేస్తారని ముదిరాజ్ మహాసభకు పూర్తి నమ్మకం ఉన్నది.
కృపా సాగర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు