తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు వెసులుబాటు తిరుమల తిరుపతి దేవస్థానం వెలుసుబాటు కల్పించింది. ప్రత్యేక దర్శనం తేదీని మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ 21 నుంచి మే 31 వరకు అవకాశం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ దర్శన తేదీలు మార్చుకునేందుకు వీలు కల్పించింది. అయితే, ఏడాదిలో ఒకసారి మాత్రమే మార్పునకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దర్శన టికెట్లు పొందిన భక్తులు స్వామి దర్శనానికి రాలేకపోతున్నట్లు గుర్తించిన దేవస్థానం బోర్డు ఈ మేరకు అవకాశం కల్పించింది. భక్తులు విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గుతోంది. మంగళవారం 2,262 మంది భక్తులే స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 925 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, పరామణి ద్వారా రూ.11లక్షల ఆదాయం వచ్చినట్లు వివరించింది.