మారేడ్పల్లి, జూలై 7 : రైల్వేలో లోకో పైలెట్ను.. అని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ.. పలువురి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన సురజ్ కుమార్ రామ్ (39) పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఆయా ప్రాంతాల్లో కూలీగా పని చేస్తూ.. జీవనం సాగిస్తుండే వాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రయాణికులను మోసం చేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశాడు.
మూసాపేట ప్రాంతానికి చెందిన శ్రావణి అనే ప్రయాణికురాలు కుటుంబ సభ్యులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 1వ నంబర్ ప్లాట్ ఫారంలోని వెయిటింగ్ హాల్లో ఉన్నది. ఇది గమనించిన నిందితుడు.. వారి వద్దకు వెళ్లి.. తాను రైల్వే పైలెట్ను అని పరిచయం చేసుకున్నాడు. వారికి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భోజనం కూడా చేయించాడు. అనంతరం శ్రావణి కుటుంబ సభ్యులతో నమ్మకంగా ఉంటూ.. వారి బ్యాగ్లోనుంచి 6 తులాల బం గారు ఆభరణాలు, రూ.18వేలు చోరీ చేసి పరారయ్యాడు. వెంటనే బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు సురజ్ కుమార్రామ్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మారేడ్పల్లి, జూలై 7 : ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగులోని మరో వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… రంజిత్, గుండా శ్రీనివాస్ నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని పథకం వేసి ఇందుకు ఏజెంట్లను నియమించుకున్నారు. 2017లో వనపర్తికి చెందిన శివరాజు అనే నిరుద్యోగి ఉద్యోగం కోసం గుండా శ్రీనివాస్ను సంప్రదించగా రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వరదరాజులు అనే వ్యక్తిని పరిచయం చేశాడు. ఆయన సూచన మేరకు రెజిమెంటల్బజార్లోని బాలాజీ డిఫెన్స్ అకాడమీకి వచ్చి రిసెప్షన్గా పనిచేసే స్వప్నను కలిశాడు. టీసీ ఉద్యోగం కోసం రూ. 8లక్షలు ఖర్చు అవుతుందని తెలుపగా.. రూ.5 లక్షలు చెల్లించడంతో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. తర్వాత బాధితుడు ఆర్డర్ కాపీతో రైల్వే అధికారులను కలువగా.. ఆర్డర్ నకిలీదని తేల్చిచెప్పారు. జరిగిన మోసంపై బాధితుడు గోపాలపురం పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో స్వప్నను ఆరెస్టు చేసిన పోలీసులు మిగితా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఏ2 నిందితుడు శ్రీనివాస్ను అరెస్టు చేశారు. రంజిత్ పరారీలో ఉన్నాడు.