చండీఘడ్ : రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రైవేట్ దవాఖానలు వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ అంగీకరించారు. ఈ అంశంపై దర్యాప్తు పూర్తయితే తాను పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన శుక్రవారం వెల్లడించారు. వ్యాక్సిన్లను లాభాలకు అమ్ముకుంటన్నారని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఆరోపణలపై స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
వ్యాక్సిన్ల వ్యవహారం తాను పర్యవేక్షించలేదని, తాను కరోనా చికిత్స, టెస్టింగ్, శాంపిల్ సేకరణ, వ్యాక్సినేషన్ శిబిరాల నిర్వహణ వంటి అంశాలనే పర్యవేక్షించానని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వ్యాక్సిన్ల కొనుగోలు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఏ ధరలపై వాటిని విక్రయించారనే విషయం నిగ్గుతేల్చుతామన్నారు. వ్యాక్సిన్ల కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్టు తేలితే కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.