హైదరాబాద్ : రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గాల్లోని ముంపు ప్రాంతాల సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించినట్లు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలో ప్రజలు ముంపుకు గురికాకుండా ఉండేందుకు రూ.848 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
వర్షం పడితే నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి, సమస్యను పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను అనుసంధానం చేస్తూ నగరంలోని పనులన్నింటినీ 15 ప్యాకేజీలుగా రూపొందిస్తున్నామన్నారు. ప్రమాదాల నివారణకు గొలుసుకట్టు చెరువులను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.