రాష్ట్ర ప్రభుత్వానికి 21 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా
జెండా ఊపి ట్యాంకర్ను పంపిన భద్రాద్రి అడిషనల్ కలెక్టర్
సారపాక, ఏప్రిల్ 29: కరోనా రోగులకు ఐటీసీ ఊపిరినిచ్చింది. సారపాక పారిశ్రామిక ప్రాంతంలో అతిపెద్ద కర్మాగారంగా పేరున్న ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ కరోనా రోగులకు బాసటగా నిలిచింది. ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చింది. గురువారం అదనపు కలెక్టర్ అనుదీప్ ప్రభుత్వానికి 21 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ను జెండా ఊపి పంపారు. ఈ సందర్భంగా ఐటీసీ జీఎం (హెచ్ఆర్) ప్రబోద్కుమార్ పాత్రో మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో సమాజానికి మద్దతు ఇవ్వడానికి ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ గడిచిన 14 నెలల్లో బహుళ క్రియాశీల సామాజిక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. తెలంగాణలో అవసరమైన కొవిడ్ రోగులకు ఉచిత ఆక్సిజన్ను సరఫరా చేయడానికి యూనిట్ తన ప్రక్రియ, నైపుణ్యం, పరిశ్రమ నెట్వర్క్ను ప్రభావితం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు 21 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్తో ఒక ట్యాంకర్ను సరఫరా చేస్తున్నామన్నారు. ఐటీసీ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ నుంచి ప్రతిరోజూ 5 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్ను సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తొలుత అడిషనల్ కలెక్టర్ అనుదీప్ ఐటీసీ కర్మాగారాన్ని సందర్శించి పలు విభాగాలను కలియతిరిగి యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.