న్యూఢిల్లీ: పంజాబ్ అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలను పరిష్కరించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం రూపొందించిన రాజీ ఫార్ములా పరిస్థితిని మరింత సంక్లిష్ఠం చేసింది. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, మాజీ ఎంపీ నవ్జ్యోతి సిద్దూ మధ్య పరిస్థితి ఉప్పూ నిప్పుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై చర్చోప చర్చలు గావించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. సిద్దూను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం అమరిందర్ సింగ్కు శరాఘాతంలా తగిలింది. దీనిపై అమరిందర్ సింగ్ గురువారం మొహాలీలోని తన ప్రైవేట్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు.
మరోవైపు అమరిందర్ సింగ్ వ్యతిరేక గ్రూప్లోని ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో నవ్ జ్యోతి సిద్దూతో విడిగా సమావేశయ్యారు. సిద్దూతో భేటీ అయిన మంత్రుల్లో సుఖీందర్ సింగ్ రాంధావా, చరణ్జిత్ సింగ్ చన్నీ, త్రిప్ట్ రాజీందర్ బజ్వా ఉన్నారు.
తిరుగుబాటు మంత్రులను క్యాబినెట్ నుంచి సీఎం అమరిందర్ సింగ్ తొలగిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిసింది.
సునీల్ జక్కర్ స్థానంలో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా సిద్దూ నియమించనున్నట్లు పేర్కొన్నా.. కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా ఆ ప్రకటన వెల్లడించలేదు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఒక దళితుడు, మరో హిందువును నియమించారు.
ఇటీవల సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రాలతోపాటు సిద్ధూ, అమరిందర్ సింగ్ మధ్య దఫాదఫాలుగా చర్చోపచర్చలు జరిపి ఈ ప్రణాళికను రూపొందించారు.
2017 ఎన్నికల నుంచి అమరిందర్ సింగ్, నవ్జ్యోతి సిద్దూ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్దూ.. ఆ ఎన్నికల్లో గెలిస్తే డిప్యూటీ సీఎం అవుతారని ఆశలు పెట్టుకున్నారు. కానీ, సిద్దూను అమరిందర్ సింగ్ పక్కనబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
సమ్మిళిత ఆర్థిక వృద్ధితోనే అసమానతలకు చెక్ : ఆర్బీఐ గవర్నర్
పెట్రో షాక్ : వాహన విక్రయాలకు ఎదురుదెబ్బ
బ్లాక్ డెవలప్మెంట్ చీఫ్గా భార్య.. అదే ఆఫీసులో భర్త స్వీపర్
కొంపముంచిన సెలబ్రెటీల ట్వీట్లు.. ఒక్కో పోస్టుతో వేల కోట్ల రూపాయలు ఆవిరి !
సొంతింటి కోసం హైదరాబాదీల పరుగులు.. గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు