చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్గా నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలను సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ భవన్కు ఆహ్వానించారు. అనంతరం అంతా కలిసి కాంగ్రెస్ భవనానికి చేరుకుని కొత్త పీపీసీసీ బృందం బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం మీడియా సలహాదారుడు తెలిపారు.
మరోవైపు కొత్త పీసీసీ టీంను ఆశీర్వదించేందుకు శుక్రవారం జరిగే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని సీఎం అమరీందర్ సింగ్ను సిద్ధూ గురువారం మరోసారి ఆహ్వానించారు. ఈ మేరకు రెండోసారి లేఖ రాశారు. ఈ లేఖపై 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకం చేశారు. కాగా, కాంగ్రెస్ చీఫ్గా సిద్ధూ నియమకాన్ని వ్యతిరేకించిన సీఎం అమరీందర్ సింగ్, క్షమాపణలు చెప్పేంత వరకు ఆయనను కలువబోనని ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బాధ్యతల స్వీకారానికి సీఎం హాజరవుతారా లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. అయితే ఈ కార్యక్రమానికి సీఎం హాజరవుతారని ఆయన మీడియా సలహాదారుడు పేర్కొన్నారు.
కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు పంజాబ్ కాంగ్రెస్ భవన్లో జరిగే కార్యక్రమంలో సిద్దూ, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు కుల్జిత్ సింగ్ నాగ్రా, సంగత్ సింగ్ గిల్జియాన్, పవన్ గోయెల్, సుఖ్వీందర్ సింగ్ డానీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పంజాబ్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్ పార్టీ హైకమాండ్ ప్రతినిధిగా హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.