చండీగఢ్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు సోమవారం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ ప్రకటించింది. తదుపరి ఆదేశాల వరకు ఇది అమలులో ఉంటుందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం అమరీందర్ సింగ్ సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి దిగజారితే పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాల్సి వస్తుందని ఇటీవల ఆయన హెచ్చరించారు. పంజాబ్లో రోజువారీ కరోనా కేసుల నమోదు ఏడు వేలు దాటడం ఆందోళన రేపుతున్నది.