పుణె: బర్త్, డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి పుణె మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక నుంచి వార్డు స్థాయిలోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలను అందజేయనున్నట్లు పేర్కొన్నది. ఇక నుంచి పుణె ప్రజలు వార్డు కార్యాలయాల్లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇంతకుముందు జనన, మరణ ధృవీకరణ పత్రాలు కావాలంటే ముందుగా వార్డు కార్యాలయానికి, ఆ తర్వాత మండల కార్యాలయానికి వెళ్లి అక్కడి వైద్యాధికారిని కలిసి ధృవీకరణ పత్రం పొందాల్సి ఉండేది. దీనివల్ల ప్రజలకు, అధికారులకు సమయం చాలా వృథా అయ్యేది. ఈ నేపథ్యంలో పీఎంసీ తాజా నిర్ణయం తీసుకున్నది.