పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పది శాతం పిల్లల కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా సోకిన పిల్లల్లో చిన్నారులతోపాటు శిశువులు కూడా ఉన్నట్లు పుదుచ్చేరి ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ అరుణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామని చెప్పారు. పిల్లల వార్డుల్లో ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు కరోనా నిబంధనలు పాటించాలని, వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన కోరారు.
మరోవైపు ఇప్పటి వరకు 16 మంది పిల్లలు కరోనాతో ఆసుపత్రిలో చేరినట్లు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తెలిపారు. పిల్లలు కరోనా బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పిల్లలను బయటకు తీసుకెళ్లవద్దని, బంధువుల ఇండ్లకు వెళ్లడం లేదా వారిని ఆహ్వానించడం మానుకోవాలని సూచించారు.