ముంబై: దేశంలోకెల్లా అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి సౌదీ అరేబియా ఆయిల్ జెయింట్.. సౌదీ ఆరామ్ చైర్మన్ యాసిర్ అల్ రుమాయన్ చేరనున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. రిలయన్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ)లో సౌదీ ఆరామ్ కో 150 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనున్నదని తెలుస్తున్నది.
ఇదే జరిగితే, రిలయన్స్ బోర్డు లోగానీ, ఓ2సీ యూనిట్ బోర్డులోకి గానీ యాసిర్ అల్ రుమాయన్ చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ నెల 24న జరిగే రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
రిలయన్స్ ఏజీఎం సమావేశం పైనే అందరి ద్రుష్టి కేంద్రీక్రుతమైంది. ఇంతకుముందు జరిగిన సమావేశాల్లో రిలయన్స్ యాజమాన్యం సంచలన నిర్ణయాలు తీసుకున్నది.
2019 ఆగస్టులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ తమ పెట్రో కెమికల్ బిజినెస్లో సౌదీ ఆరామ్ కో పెట్టుబడులు పెడుతుందని ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల అది ఆచరణలోకి రాలేదు.
గతేడాది ఏజీఎం తర్వాత రిలయన్స్ జియో/ రిటైల్ సంస్థల్లో గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, క్వాల్కామ్ సంస్థలతోపాటు ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి.
తర్వాత జియో ప్లాట్ఫామ్స్లోనూ, రిలయన్స్ రిటైల్ సంస్థల్లో ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. దీంతో 2021 మార్చి లోపు పూర్తిగా రుణ రహిత సంస్థగా రిలయన్స్ను తీర్చి దిద్దాలన్న ముకేశ్ అంబానీ కల నెరవేరింది.
తాజాగా పెట్రో కెమికల్ బిజినెస్లో సౌదీ ఆరామ్ కోకు వాటాల విక్రయం పట్ల రిలయన్స్ ఆసక్తిగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే 24న జరిగే ఏజీఎంలో ఈ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తున్నది. ఈ డీల్పై రిలయన్స్, సౌదీ ఆరామ్ కో స్పందించడానికి నిరాకరించాయి.