పుదుచ్చేరి : రానున్న పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి పోటీ చేయడం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దినేశ్ గుండు రావు తెలిపారు. ఆయన ఎన్నికల ప్రచార, నిర్వహణ బాధ్యతలు మోస్తారని చెప్పారు. 30 స్థానాలున్న పుదుచ్చేరి శాసనసభకు ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే 14 మందితో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
కాంగ్రెస్ ముఖ్య నేతలైన సెల్వనందని కదిర్గామం అసెంబీ స్థానం నుంచి, ఎం కణ్ణన్ ఇందిరానగర్ స్థానం నుంచి, కార్తికేయన్ ఔసుడు నియోజకవర్గం నుంచి, రమేశ్ ప్రేమ్బత్ మహే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా వీటిలో 5 స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. దాదాపు 10 లక్షలకుపైగా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.