‘నేను నటించిన ప్రతి సినిమాను తొలి రోజు థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూస్తుంటాను. సినిమాకు లభించే వసూళ్లు, ప్రశంసల కంటే ప్రేక్షకుల స్పందనను నేరుగా గమనించడంలోనే నాకు ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది’ అని చెప్పింది నివేధా థామస్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వకీల్సాబ్’. పవన్కల్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్వేణు దర్శకుడు. దిల్రాజు, శిరీష్ నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విశేషాల్ని గురించి నివేధా థామస్ చెప్పిన ముచ్చట్లివి..
సినిమాతో పాటు నా పాత్రకు వస్తోన్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.విడుదలకు ముందు కరోనా బారిన పడటంతో చాలా నిరుత్సాహపడ్డా. ఇటీవల నెగెటివ్ రిపోర్ట్ రావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్కు వెళ్లాను. ప్రేక్షకుల స్పందన చూడగానే సంతోషంతో నా కడుపు నిండిపోయింది. నా కెరీర్లో కష్టసాధ్యమైన క్యారెక్టర్స్లో ఇది ఒకటి. నిజజీవితంలో నా స్నేహితులకు ఎదురైన సమస్యలను గమనిస్తూ పాత్ర కోసం సన్నద్దమయ్యా. అలాగని ఎక్కువగా రీసెర్చ్ చేయలేదు. వ్యక్తిగతంగా తీసుకుంటూ నటిస్తే ఇబ్బందిపడతాననిపించింది దర్శకుడిపైనే చాలా ఆధారపడ్డా. సమాజంలో మహిళలకు ఎదురవుతున్న వివక్ష, అణిచివేతను గురించి ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించాం. మేము చెప్పాలనుకున్న పాయింట్ ప్రేక్షకులకు చేరువ కావడం ఆనందంగా ఉంది. కథ, పాత్రలతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతున్నారు. తమ జీవితాల్ని తెరపై చూసుకున్న ఫీలింగ్కు లోనవుతున్నారు.
మంచి సినిమాల్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారంటే నేను వద్దనే చెబుతుంటా. నాకు బాగా నచ్చిన సినిమాల్లో ‘పింక్’ ఒకటి. ఈసినిమాను తెలుగులో పునర్నిర్మిస్తున్నారని తెలియగానే మాతృకలోని ఎమోషన్స్ను పునసృష్టించడం సాధ్యమేనా అనిపించింది. ఇలాంటి సామాజిక ఇతివృత్తాన్ని కమర్షియల్ హంగులతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలాచెప్పడం పెద్ద బాధ్యతతో కూడుకున్నది. ఆ విషయంలో దర్శకుడు శ్రీరామ్వేణు సక్సెస్ అయ్యారు. భిన్న కుటుంబ నేపథ్యాలకు చెందిన అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యల్ని ఆవిష్కరించిన తీరు, పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. దర్శకుడిపై ఉన్న నమ్మకంతోనే సినిమాను అంగీకరించా. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ చేసిన సినిమా ఇది. ఆయన నుంచి అభిమానులు కోరుకునే వాణిజ్య అంశాలన్నింటిని కథలో ఇముడ్చుతూ చక్కగా సినిమాను తెరకెక్కించారు. మహిళా సాధికారత ఔన్నత్యాన్ని చాటే అర్థవంతమైన చిత్రమిది. పవన్కల్యాణ్తో కలిసి నటించడానికి ఇలాంటి మంచి కథ కుదరడం ఆనందంగా ఉంది. చిత్రీకరణ సమయంలో సినిమాలతో పాటు పలు సామాజిక అంశాల గురించి ఆయనతో చర్చించే అవకాశం దొరికింది. ముఖ్యంగా కోర్ట్ రూమ్ సన్నివేశాల్లో న టించేప్పుడు పవన్కల్యాణ్తో చక్కటి అనుబంధం ఏర్పడింది.
రీమేక్ల విషయంలో మాతృకతో పోలికలు రావడం సహజం. కంపేరిజన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. వాటిని పట్టించుకోకుండా నా పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయడంపైనే దృష్టిపెట్టా. బాలీవుడ్లో తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో నేను చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. కోర్ట్రూమ్ సన్నివేశాల్లో నా పాత్ర తాలూకు నేపథ్యాన్ని గుర్తుంచుకుంటూ సీన్కు అనుగుణంగా భావోద్వేగాల్ని పడించడం ఛాలెంజింగ్గా అనిపించింది. సినిమా పరంగా నేను తీసుకున్న రిస్క్కు చక్కటి ఫలితం దక్కుతోంది. ప్రస్తుతం టాలీవుడ్పైనే దృష్టిపెట్టా. కొరియన్ చిత్రం ‘మిడ్నైట్ రన్నర్స్’ ఆధారంగా సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నా. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.