చట్టసభల్లో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూలై 5: చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ స్థాయిని మరిచి ప్రవర్తించడం, సభల్లో మైకులు విరగ్గొట్టడం, బల్లలు ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2015లో కేరళ అసెంబ్లీలో ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, సభలో వస్తువులను ధ్వంసం చేయడంతో కొంతమందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కొట్టేయాలని ప్రస్తుత ఎల్డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు సోమవారం విచారణ జరిపింది. ‘చట్టసభల్లో నిరసన తెలిపే పద్ధతి అది కాదు. ప్రజాప్రతినిధులు అలా ప్రవర్తించడం చాలా తీవ్రమైన విషయం’ అని వ్యాఖ్యానించింది. సభలో అంత దురుసుగా ప్రవర్తించినవారిపై కేసులను ఎందుకు కొట్టేయాలని, విచారణ ఎదుర్కొంటే ఏమవుతుందని ప్రశ్నించింది. ఇటీవలి కాలంలో పార్లమెంటులో కూడా ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టసభల్లో సుహృద్భావ వాతావరణం ప్రజాస్వామ్యానికి కీలకం అని నొక్కి చెప్పింది. పిటిషన్పై విచారణను వారం రోజులు వాయిదా వేసింది.