లాహోర్: పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు కేసులో పీటర్ పాల్ డేవిడ్ అనే విదేశీయుడిని గురువారం లాహోర్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసిన పాకిస్తాన్ మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. అరెస్టు చేసిన అనంతరం అతన్ని రహస్య ప్రదేశానికి తరలించి విచారించినట్లు దునియా టీవీ పేర్కొన్నది. అయితే పేలుడుకు ఉపయోగించిన కారు డేవిడ్దే అని విచారణలో తేలినట్లు డాన్ తెలిపింది. ఈ పేలుడు ఘటన కంటే ముందు డేవిడ్ కరాచీ, లాహోర్, దుబాయికి తరుచుగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో అతను ఈ మూడు ప్రదేశాలకు ఎందుకు ప్రయాణించాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో సంభవించిన పేలుడు ధాటికి ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నగరంలోని జోహర్ పట్టణంలో హఫీజ్ నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి సమీపంలోని ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమైనట్లు లాహోర్ పోలీసులు తెలిపారు. గాయపడిన 21 మందిలో ఓ పోలీస్ అధికారి సహా మహిళలు, చిన్నారులు ఉన్నారని, గాయపడ్డ వారిని జిన్నా హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.