ముంబై: నవీ ముంబైలో కొత్త ఎయిర్పోర్ట్ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.16 వేల కోట్ల ఖర్చుతో ఆ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో ఆ విమానాశ్రయం అందుబాటులోకి రానున్నది. కానీ అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ పేరు కోసం రాజకీయ పార్టీలు మధ్య చిచ్చు మొదలైంది. అతిపెద్ద గ్రీఫీల్డ్ ఎయిర్పోర్ట్గా నవీ ముంబైలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి తమ నాయకుడి పేరు పెట్టాలని శివసేన, బీజేపీ, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీలు వాగ్వాదానికి దిగుతున్నాయి. ఇవాళ సిడ్కో ఆఫీసు వద్ద ఆ పార్టీలకు చెందిన వేలాది మంది నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
కొత్త ఎయిర్పోర్ట్కు తమ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే పేరు పెట్టాలని శివసేన డిమాండ్ చేస్తున్నది. అయితే స్థానికంగా రైతుల తరపున ఉద్యమం చేపట్టిన డీబీ పాటిల్ పేరును ఆ విమానాశ్రయానికి పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఇక రాజ్థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన .. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పేరును ఆ ఎయిర్పోర్ట్కు పెట్టాలని డిమాండ్ చేస్తున్నది.
కొత్త విమానాశ్రయంలో 3700 మీటర్ల పొడువైన రెండు రన్వేలను నిర్మిస్తున్నారు. తొలి దశలో భాగంగా మొదటి రన్వేను 2023లో పూర్తి చేయనున్నారు. సిడ్కో వద్ద ఇవాళ నిరసనకారులను అదుపు చేసేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.