న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని యూపీ గేట్ వద్ద గత కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. ఢిల్లీ నుంచి వస్తున్న కొత్తగా నియమితులైన బీజేపీ కార్యదర్శి అమిత్ వాల్మీకి స్వాగతం పలికేందుకు ఢిల్లీ-ఘాజియాబాద్ ఎక్స్ప్రెస్వేను అనుసంధానించే హిండన్ ఎలివేటెడ్ రహదారి ప్రారంభం వద్దకు సుమారు 400 మంది బీజేపీ కార్యకర్తలు చేరగా మరోవైపున ఉన్న రైతులు వందల సంఖ్యలో తమవైపునకు వచ్చి దాడి చేశారని ఘజియాబాద్ బీజేపీ యూనిట్ నగర అధ్యక్షుడు సంజీవ్ శర్మ ఆరోపించారు. పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారని, పలు వాహనాలు ధ్వంసమయ్యాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
కాగా తమ శాంతియుత నిరసనను భగ్నం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి జగ్తార్ సింగ్ బజ్వా తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మరోవైపు రైతులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ విషయం తెలిసిన వెంటనే అక్కడకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దినట్లు ఘజియాబాద్ ఎస్పీ జ్ఞానేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ఇరు వర్గాలు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.