సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల దోపిడీ పరంపర కొనసాగుతూనే ఉన్నది. తమ వద్ద పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి.. మూసారాంబాగ్కు చెందిన మహిళ వద్ద రూ. 3.66 లక్షలు కాజేశారు. తొలుత బాధితురాలి సెల్ఫోన్కు ఓ లింక్ పంపించారు. అది క్లిక్ చేయగానే ఇన్వెస్ట్మెంట్ షాప్ నౌ అనే వెబ్సైట్ ప్రత్యక్షమైంది. దానిని ఓపెన్ చేయగానే సైబర్నేరగాళ్లు ఆమెకు ఫోన్ చేసి.. పెట్టుబడి పెడితే.. మంచి లాభాలిస్తామంటూ నమ్మబలికారు.
తొలుత రూ.10 వేలు పెట్టడంతో వెయ్యి రూపాయల లాభాన్ని చూపించారు. తరువాత మరోసారి ఫోన్ చేసి ‘మరింత పెట్టుబడి పెట్టాలంటూ.. ఒత్తిడి తేవగా, ఆమె వారు చెప్పినట్లు చేసింది. ఆ తరువాత సదరు వ్యక్తుల సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించింది. శుక్రవారం బాధితురాలి సోదరుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరో కేసులో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ కోసం ఓ వ్యక్తి ఆన్లైన్లో రూ. 1.2 లక్షలు చెల్లించి.. మోసపోవడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.