శ్రీనగర్: హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్గా మసారత్ ఆలం భట్ను పాకిస్థాన్ నియమించడంపై జమ్ముకశ్మీర్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. పాకిస్థాన్ను సమర్థించే జమ్ముకశ్మీర్ వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ సుమారు 30 ఏండ్లుగా హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్గా వ్వవహరించారు. సెప్టెంబర్ 1న ఆయన చనిపోవడంతో ఉగ్రవాది నుంచి వేర్పాటువాదిగా మారిన మసారత్ ఆలం భట్ను తాత్కాలిక చైర్మన్గా, షబీర్ అహ్మద్ షా, గులాం అహ్మద్ గుల్జార్ను ఉప చైర్మన్లగా ఎన్నుకున్నారు. దీనిపైబీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన తెలిపారు. మసారత్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారి పోస్టర్లను దహనం చేశారు. తీహార్ జైలులో ఉన్న మసారత్ను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
కాగా, 50 ఏండ్ల మసారత్ ఆలం భట్ 1990లో జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలో చేరాడు. దీనికి ముందు 1988లో ముస్లిం లీగ్ వేర్పాటువాద సంస్థను స్థాపించిన ముస్తాక్ అహ్మద్ భట్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు స్థానిక కమాండర్గా వ్యవహరించాడు. అనంతరం కశ్మీర్ వేర్పాటువాదిగా మారి హురియత్ చీఫ్ గిలానీతో చేతులు కలిపాడు. గిలానీ కంటే పాకిస్థాన్ను ఎక్కువగా సమర్థించే మసారత్ అనంతరం హురియత్లో కీలక నేతగా ఎదిగాడు.
2010 కశ్మీర్ అల్లర్లు, రాళ్ల దాడికి సూత్రధారి, అనంతరం దానిని ట్రెండ్గా చేసిన మసారత్ ఆలం అరెస్ట్ కోసం నాటి యూపీఏ ప్రభుత్వం రివార్డు ప్రకటించింది. అనంతరం అరెస్టైన అతడ్ని జమ్ముకశ్మీర్ జైలులో ఉంచారు. నాలుగున్నర ఏండ్ల తర్వాత 2015లో ముఫ్తీ ప్రభుత్వం అతడ్ని విడుదల చేసింది. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మసారత్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని పీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి.
2015లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం కింద మసారత్ను అరెస్ట్ చేయగా నాటి నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. దేశంలోకి ఉగ్ర నిధుల మళ్లింపు ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2019లో మసారత్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. పాకిస్థాన్కు చెందిన ఏజెంట్ల ద్వారా గిలానీతోపాటు కశ్మీర్ వేర్పాటువాదులకు హవాలా మార్గంలో నిధులు చేరేవని ఇంటరాగేషన్లో వెల్లడించాడు. ఈ నిధులపై హురియత్లో చీలికలు వచ్చినట్లు పేర్కొన్నాడు.
కాగా, 2020 జూన్లో పాకిస్థాన్ చాప్టర్ ద్వారా హురియత్లో నియామకాలు చేపట్టడంపై విభేదాలు తలెత్తాయి. దీంతో గిలానీ నాటి నుంచి హురియత్కు దూరంగా ఉన్నారు. ఆయన మరణంతో తీహార్ జైలులో ఉన్న మసారత్ ఆలంను హురియత్ చీఫ్గా పాకిస్థాన్ చాప్టర్ ప్రకటించింది. దీనిపై జమ్ముకశ్మీర్లో బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.