కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలి
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగా ణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం వ్యవసాయరంగంలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉన్నదన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్కందా రచించిన ‘అగ్రికల్చర్ ఇన్ ఇండియా ; కాంటెంపరరీ చాలెంజెస్- ఇన్ ద కాంటెక్ట్స్ ఆఫ్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్లో వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న కమతాలు, రుతుపవనాలపైనే ఆధారపడటం, సమయానికి రుణాలు అందకపోవడం వంటి కారణాలతో రైతులు వ్యవసాయంలో రాణించలేకపోతున్నారని తెలిపారు. సాగును లాభసాటిగా మార్చుకునేందుకు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సంధ్య, మల్లికార్జున్రెడ్డి విషయాన్ని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పాల్గొన్నారు.